2019 నుండి వ్యవసాయ, అనుబంధ రంగాలకు అరుణాచల్ ప్రాధాన్యత
సీఎం పెమా ఖండూ
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్లో 2019 నుండి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి పెమా ఖండూ స్పష్టం చేశారు. నహర్లగన్లో నూతనంగా నిర్మించిన రాష్ట్ర వ్యవసాయ సమాచార కేంద్రం-కమ్-రైతుల హాస్టల్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్స్య ఇ-వాహిని, ఇ-రిక్షా సేవలను జెండా ఊపి ప్రారంభించిన ఆయన, వ్యవసాయం, ఉద్యానవన, మత్స్య, పశుసంవర్ధక శాఖల మధ్య సాధించిన సమన్వయం రాష్ట్రంలో గణనీయమైన ఫలితాలను ఇస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న విభిన్న వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగానికి ఎంతో అనుకూలమని, సాంకేతిక పరిజ్ఞానం మరియు మార్కెట్ అనుసంధానం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం అన్నారు. గత దశాబ్ద కాలంలో దాదాపు 1.50 లక్షల మంది మహిళలు స్వయం సహాయక బృందాల్లో చేరి ఆర్థిక సాధికారత సాధించారని తెలిపారు. జిల్లాల వారీగా రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్పీఓ) బలోపేతం చేస్తున్నామని చెబుతూ, కొత్తగా ప్రారంభించిన రైతుల హాస్టల్ సదుపాయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఆధునిక పద్ధతులపై రైతులకు శిక్షణ అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.