కొత్త ప్రావిన్సుల ప్రతిపాదనతో పాకిస్తాన్లో రాజ్యాంగ సంక్షోభం
మునీర్ నిర్ణయంపై వీధుల్లోకి ప్రజలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో పరిపాలనా సంస్కరణల పేరుతో కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేసేందుకు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైనిక-ప్రభుత్వ వ్యవస్థ చేస్తున్న ప్రయత్నాలు దేశంలో తీవ్ర రాజ్యాంగ సంక్షోభానికి దారితీశాయి. 25 కోట్లకు పైగా ఉన్న జనాభాను ప్రస్తుతం ఉన్న నాలుగు ప్రావిన్సులు నిర్వహించలేవని, దేశాన్ని 12 నుండి 15 కొత్త విభాగాలుగా విభజించాలని అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ, ప్రణాళికా మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ప్రతిపాదించారు. అయితే, ఈ నిర్ణయం కరాచీ నుండి బలూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ వరకు తీవ్ర అశాంతిని రగిల్చింది.
ప్రావిన్సుల సరిహద్దులను శాసనసభల అనుమతి లేకుండా మార్చేందుకు వీలుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 (క్లాజ్ 4)ను తొలగించడానికి 28వ రాజ్యాంగ సవరణ తలపెట్టారనే వార్తలపై సింధ్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కరాచీని సమాఖ్య నియంత్రణ కిందకు తెస్తారనే ప్రచారంతో జూలై, ఆగస్టు నెలల్లో "వహ్దత్-ఇ-సింధ్" పేరిట వేలాది మంది యువకులు రోడ్లపైకి వచ్చారు. ఈ పరిణామాలపై స్పందించిన సింధ్ శాసనసభ సెప్టెంబర్ 3న రాష్ట్ర చారిత్రక సరిహద్దులను మార్చే ప్రతిపాదనను తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించి, కేంద్రానికి ముందస్తు వీటో సందేశాన్ని పంపింది.
కొత్త ప్రావిన్సుల ఏర్పాటు ప్రతిపాదనను విశ్లేషకులు 1955-1970 నాటి అపఖ్యాతి పాలైన "వన్ యూనిట్" పథకంతో పోలుస్తున్నారు. నాటి సైనిక పాలన ప్రావిన్సుల సరిహద్దులను చెరిపివేయడమే చివరికి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ఈ ప్రాంతీయ ఉద్రిక్తతలకు తోడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదలను కోరుతూ పి.టి.ఐ. చేపట్టిన నిరసనలు, బలూచిస్తాన్లో పెరుగుతున్న హింస సైనిక వ్యవస్థకు తీవ్ర సవాలుగా మారాయి. ఈ పరిణామాలపై స్పందించిన 'డాన్' పత్రిక, స్పష్టమైన పరిష్కారాలు లేకుండా దేశాన్ని మరో వికారమైన సంక్షోభంలోకి తోయవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.