హౌతీలపై అమెరికా సైనిక సాయం కోరిన సౌదీ యువరాజు
రియాద్: ఎర్ర సముద్రంలో యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారుల ముప్పు తీవ్రమవుతున్న నేపథ్యంలో, వారితో పోరాడేందుకు అమెరికా సైనిక సహాయాన్ని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కోరారు. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి ప్రత్యక్ష సైనిక చర్యకు సిద్ధంగా లేమని స్పష్టం చేసిన వాషింగ్టన్, నిఘా సమాచారాన్ని పంచుకోవడం మరియు లక్ష్యాలను నిర్ధారించడంలో రియాద్కు సహకరిస్తామని తెలిపినట్లు సమాచారం.
ఈ పరిణామాల మధ్య అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ చర్చల నిమిత్తం సౌదీ అరేబియాలో పర్యటించారు. ఇరాన్తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, హోర్ముజ్ జలసంధి మూతపడటంతో సౌదీ అరేబియా చమురు రవాణా కోసం ఎర్ర సముద్ర మార్గంపైనే ఆధారపడుతోంది. అయితే అక్కడ బాబ్ ఎల్-మండేబ్ జలసంధిపై హౌతీల నియంత్రణ పెరిగితే ప్రపంచ చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. గతంలో హౌతీలతో ఒంటరిగానే పోరాడగలమని చెప్పిన సౌదీ, ఎర్ర సముద్రంలో భద్రతా ముప్పు పెరగడంతో ఇప్పుడు అమెరికా వైపు చూడటం గమనార్హం. ఎర్ర సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛను, తమ జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు అమెరికా పరిపాలనా వర్గాలు వెల్లడించాయి.