ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు
న్యూఢిల్లీ: భారత్ మండపంలో శనివారం ప్రారంభమైన 18వ బ్రిక్స్ సదస్సు నేపధ్యంలో ఢిల్లీలో విదేశీ ప్రముఖుల రాకపోకల దృష్ట్యా కీలక రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు మరియు దారి మళ్లింపులను ఢిల్లీ పోలీసులు అమలులోకి తెచ్చారు. శనివారం ఉదయం 9:30 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు నగర వ్యాప్తంగా ప్రధాన మార్గాల్లో ఈ నియంత్రణలు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
ఈ సందర్భంగా సర్దార్ పటేల్ మార్గ్, అక్బర్ రోడ్, మధుర రోడ్, ఆఫ్రికా అవెన్యూ, శాంతి పాత్, జన్పథ్, అశోకా రోడ్ సహా లూటియన్స్ ఢిల్లీలోని పలు మార్గాల్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నియంత్రించారు. అత్యవసర మరియు నిత్యావసర సేవల వాహనాలకు ఆంక్షల నుండి మినహాయింపునిచ్చారు. ప్రయాణికులు అదనపు సమయాన్ని కేటాయించుకోవాలని, సాధ్యమైనంత వరకు ఢిల్లీ మెట్రో సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.