న్యూఢిల్లీకి చేరుకున్న ఇండోనేషియా, బురుండి అధ్యక్షులు
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వివిధ దేశాల నాయకులు భారత్కు చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో శుక్రవారం న్యూఢిల్లీకి విచ్చేయగా, విమానాశ్రయంలో కేంద్ర సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య మరింత సహకారం, అభివృద్ధి, శ్రేయస్సు దిశగా సంయుక్త భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఆఫ్రికన్ యూనియన్ (AU) ప్రతినిధిగా బురుండి అధ్యక్షుడు ఎవరిస్ట్ నదయిషిమియే న్యూఢిల్లీ చేరుకోగా, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆయనకు స్వాగతం పలికారు. గ్లోబల్ సౌత్ దేశాల ఉమ్మడి ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడంలో భారత్, ఆఫ్రికన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. వీరితో పాటు థాయ్లాండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి సిహాసక్ ఫువాంగ్కెట్కియో కూడా సదస్సు కోసం భారత్ చేరుకున్నారు.
సెప్టెంబర్ 12, 13 తేదీలలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో బ్రిక్స్ సభ్య దేశాలు మరియు భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఉన్నత స్థాయి సమావేశంలో వివిధ అంశాలపై సానుకూల, అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.