ఎరువుల దందా పై విజిలెన్స్ కొరడా..!
యూరియా, డీఏపీ అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ రైతుల ఫిర్యాదులు.. రెండు దుకాణాలపై కేసులు
వైష్ణవి ఫర్టిలైజర్స్లో అమ్మకాలు నిలిపివేత.. ఓం ట్రేడింగ్లో స్టాక్ లెక్కల్లో తేడాలు
తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి: ఇంచార్జి ఏఓ కొమురయ్య
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ : కొడంగల్ పట్టణంలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా ఝళిపించారు. రైతులకు యూరియా, డీఏపీ తదితర ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ రైతులు నేరుగా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. పట్టణంలోని రెండు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి స్టాక్, విక్రయాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీల్లో వైష్ణవి ఫర్టిలైజర్స్ దుకాణంలో ఎరువుల విక్రయాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఓం ట్రేడింగ్ కంపెనీలో భౌతికంగా ఉన్న ఎరువుల నిల్వలకు, రికార్డుల్లో నమోదైన లెక్కలకు మధ్య తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
రైతుల ఫిర్యాదులతో కదిలిన యంత్రాంగం
ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నారని రైతుల నుంచి నేరుగా ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దుకాణాల్లో యూరియా, డీఏపీ తదితర ఎరువుల నిల్వలు, ధరల పట్టిక, విక్రయ రిజిస్టర్లు, బిల్లులు, రైతులకు అందజేస్తున్న రసీదులను పరిశీలించారు. స్టాక్కు సంబంధించిన వివరాలను రికార్డులతో సరిపోల్చి చూశారు.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
రైతులకు ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి విక్రయానికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల విషయంలో రైతులను మోసం చేసే వ్యాపారులపై నిఘా కొనసాగుతుందని, తనిఖీలు నిరంతరం నిర్వహిస్తామని ఇంచార్జి ఏఓ కొమురయ్య తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే దుకాణదారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలతో కొడంగల్ పట్టణంలోని ఎరువుల వ్యాపారుల్లో కలకలం రేగింది.