రైతులకు కొండంత అభయం
దశాబ్దం పూర్తి చేసుకున్న 'ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన'
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులు, తీవ్ర ప్రకృతి వైపరీత్యాల వేళ దేశంలోని రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తున్న 'ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన' (PMFBY) విజయవంతంగా 10 ఏళ్లు (ఒక దశాబ్దం) పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 18, 2016న ప్రారంభమైన ఈ పథకం, విత్తనాలు వేసే స్థాయి నుండి పంట కోత అనంతర నష్టాల వరకు రైతులకు సమగ్ర బీమా రక్షణను అందిస్తోంది.
ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన కీలక మైలురాళ్లతో కేంద్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. దీనికి అనుగుణంగా 2026-27 బడ్జెట్లో PMFBY కోసం రూ. 12,200 కోట్లను కేటాయించింది.
2016 ఖరీఫ్ నుండి 2025-26 రబీ సీజన్ వరకు 92.46 కోట్లకు పైగా రైతు దరఖాస్తులకు బీమా కల్పించగా.. 26.33 కోట్లకు పైగా రైతు దరఖాస్తులకు సంబంధించి రూ. 2.06 లక్షల కోట్లకు పైగా క్లెయిమ్ చెల్లింపులు జరిగాయి. ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, వాణిజ్య/ఉద్యానవన పంటలకు 5% ప్రీమియం మాత్రమే రైతులు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీగా భరిస్తాయి.
ఇది కేవలం రుణాలు తీసుకున్న రైతులకే కాక, రుణగ్రహీతలు కాని సాధారణ రైతులు, కౌలు రైతులు మరియు భాగస్వామ్య రైతులకు కూడా వర్తిస్తుంది. గత దశాబ్దంలో నమోదైన మొత్తం రైతుల్లో 50% మంది రుణగ్రహీతలు కానివారే కావడం గమనార్హం. 2018 నుండి 1.44 కోట్లకు పైగా కౌలు రైతులు దీనిలో నమోదయ్యారు.
వర్షాభావం, వరదలు, పురుగులు-తెగుళ్లతో పాటు విత్తనాలు వేయలేని పరిస్థితి వస్తే 25% వరకు క్లెయిమ్ పొందే వెసులుబాటు ఉంది. కోత కోసి ఆరబెట్టిన పంట వర్షాల వల్ల పాడైతే 14 రోజుల వరకు రక్షణ లభిస్తుంది.
ప్రస్తుతం (ఖరీఫ్ 2026 నాటికి) 25 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో అమలువుతున్న ఈ పథకంలో 241.38 లక్షల మంది రైతులు నమోదయ్యారు. ఖరీఫ్ 2025లో పంట నష్టపోయిన 60.89 లక్షల మంది రైతులకు రూ. 9,837.61 కోట్ల క్లెయిమ్లను ప్రభుత్వం చెల్లించింది.