కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరశంఖం
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
నాగర్కర్నూల్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ఏడు రోజుల పాటు విస్తృత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తిమ్మాజీపేట, బిజినపల్లి, నాగర్కర్నూల్ రూరల్, టౌన్, తెలకపల్లి, తాడూరు మండలాల ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి కార్యాచరణను ప్రకటించారు.
100 రోజుల్లో 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఎన్ని అమలు చేశారో, ఎన్ని చేయలేదో ప్రజలకు వాస్తవాలు వివరించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రతి గ్రామంలో కాంగ్రెస్ హామీల అమలు తీరుపై ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి మండల స్థాయి నాయకుడు గ్రామాలను నిరంతరం సందర్శించాలి. జిల్లా కేంద్రంతో పాటు ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ప్రజా సమస్యలకు పరిష్కారం లభించే వరకు పోరాటం కొనసాగించాలి. రైతుబంధు, రుణమాఫీ, సాగునీరు, ఎరువులు, విత్తనాలు, ఉచిత విద్యుత్ సమస్యలపై రైతులతో క్షేత్రస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలి.
మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి. అలాగే విద్యార్థులు, నిరుద్యోగ యువతకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, ఉద్యోగ నోటిఫికేషన్ల అంశాలపై లోతుగా చర్చించి పోరాటాలు చేయాలి. నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు. గ్రామస్థాయిలో పార్టీ బలంగా తయారైతేనే భవిష్యత్తులో తిరిగి అధికారంలోకి రాగలమని ఆయన స్పష్టం చేశారు.