జివో 97ను తక్షణమే రద్దు చేయాలి
బీఆర్ఎస్ కేవీ నేత యాద క్రాంతి హెచ్చరిక
హైదరాబాద్: బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు, హైదరాబాద్ జిల్లా నాయకుడు యాద క్రాంతి ఆధ్వర్యంలో ‘ప్రజావాణి’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వివాదాస్పద జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, గత కొంతకాలంగా ఆందోళన బాట పట్టిన పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్వీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ సందర్భంగా యాద క్రాంతి మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకొచ్చిన స్కిల్ యూనివర్సిటీ ప్రయోగానికి విద్యార్థుల నుంచి ఆదరణ కరువైందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు గడుస్తున్నా స్కిల్ యూనివర్సిటీలో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోకపోవడాన్ని తట్టుకోలేక, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును బలితీసుకునేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే జీవో 97ను వెనక్కి తీసుకోకపోతే, విద్యారంగంపై అవగాహన లేని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు విశాల్, ప్రశాంత్, నితీష్, నవీన్, కిరణ్, బంటి తదితరులు పాల్గొన్నారు.