విగ్నేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య
వికారాబాద్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 19): వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు శివరాంనగర్ కాలనీలో కౌన్సిలర్ బాదం అనురాధ అశోక్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య, వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేశం, మాజీ వైస్ చైర్మన్ సి. రమేష్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మిక చింతనతో ఉండాలని వారు సూచించారు.వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చిన్నారుల పట్ల తల్లిదండ్రులు, నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. యువత ఐకమత్యంతో ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో వివిధ వార్డులకు చెందిన కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు, వినాయక మండపం నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.