మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ!
తెలంగాణలో మహిళా సాధికారతే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుపేద మహిళల స్వయం ఉపాధికి మరో సువర్ణావకాశం కల్పించింది. వెనుకబడిన తరగతుల (బీసీ) మహిళల ఆర్థిక భద్రతను కాపాడే లక్ష్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్' పథకం దరఖాస్తులపర్వం జోరుగా సాగుతోంది. ఎవరికైతే కుట్టుపనులపై అభిరుచి ఉండి, ఉపాధి పొందాలని ఆశ ఉందో అలాంటి వారికి ఈ పథకం ద్వారా వంద శాతం రాయితీతో అత్యాధునిక కుట్టు మిషన్లు అందజేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి విడతగా సుమారు 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రతి నియోజకవర్గానికి వెయ్యి చొప్పున ఉచితంగా పంపిణీ చేయనున్న ఒక్కో మిషన్ విలువ సుమారు 12 వేల రూపాయలు ఉంటుందని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయల లోపు ఉన్న బీసీ మహిళలు ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. ముఖ్యంగా నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. అర్హత కలిగిన ఆసక్తిగల మహిళలు అధికారిక 'TGOBMMS' పోర్టల్ ద్వారా సెప్టెంబర్ 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తించే ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సొంతంగా ఉపాధి పొందాలని సర్కార్ కోరుతోంది. నిరుపేద కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపేలా ప్రభుత్వం చేపట్టిన ఈ సంక్షేమ చర్యపై మహిళా లోకం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.