మర్పల్లి సబ్ డివిజన్ మార్పులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక చొరవ
తాండూరు డివిజన్ నుంచి వికారాబాద్ డివిజన్లోకి మర్పల్లి
ఏళ్లనాటి మర్పల్లి వాసుల కల సాకారం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 10):
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పరిధుల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జిల్లాల వారీగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల పరిధులను సవరిస్తూ ప్రభుత్వం G.O.Ms.No.32ను గురువారం జారీ చేసింది. గతంలో జారీ చేసిన G.O.Ms.No.18, G.O.Ms.No.21లకు సవరణలు చేస్తూ ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.ఈ మార్పుల్లో భాగంగా ఇప్పటివరకు తాండూరు పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న మర్పల్లి సబ్ డివిజన్ను వికారాబాద్ పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలోకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన సబ్ డివిజన్లు ఇకపై ఒకే డివిజన్ పరిధిలోకి రానున్నాయి.
*స్పీకర్ ప్రసాద్కుమార్ చొరవతోనే..*
మర్పల్లి సబ్ డివిజన్ను తాండూరు డివిజన్ నుంచి వికారాబాద్ డివిజన్లోకి మార్చడంలో తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ కీలక పాత్ర పోషించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. మర్పల్లి ప్రజల చిరకాల డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సబ్ డివిజన్ మార్పు కోసం స్పీకర్ ప్రసాద్కుమార్ చేసిన కృషి ఫలించిందని వారు తెలిపారు.మర్పల్లి సబ్ డివిజన్ వికారాబాద్ డివిజన్ పరిధిలోకి రావడంతో మర్పల్లి ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారమైందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు మర్పల్లి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
తాండూరు డివిజన్లో మూడు సబ్ డివిజన్లు
తాజా ఉత్తర్వుల ప్రకారం తాండూరు పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలో ఇకపై కోడంగల్, తాండూరు, యాలాల్ సబ్ డివిజన్లు కొనసాగనున్నాయి.
వికారాబాద్ డివిజన్లో ఐదు సబ్ డివిజన్లు
వికారాబాద్ పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలో కుల్కచర్ల, పరిగి, వికారాబాద్–I, వికారాబాద్–II, మర్పల్లి సబ్ డివిజన్లు కొనసాగనున్నాయి.
మర్పల్లి సబ్ డివిజన్ మార్పుతో పరిపాలనా పరంగా ప్రజలకు మరింత సౌలభ్యం కలగడంతో పాటు, వికారాబాద్ నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ విభాగాల మధ్య సమన్వయం మరింత మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.