మంత్రి పదవి కోసం కేకే జోరుగా లాబీయింగ్
మున్నూరు కాపు కోటాలో కుమార్తె విజయలక్ష్మికి ఛాన్స్?
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో కేకే (కె.కేశవరావు) మార్క్ లాబీయింగ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ కేకే ఢిల్లీ స్థాయిలో విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
మున్నూరు కాపు, మహిళా కోటా సమీకరణాలు
రాష్ట్ర మంత్రివర్గంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖను తప్పిస్తే, ఆ స్థానంలో తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మార్పు ద్వారా మున్నూరు కాపు బీసీ సామాజిక వర్గంతో పాటు మహిళా కోటాను కూడా సమర్థవంతంగా భర్తీ చేయవచ్చని కేకే కాంగ్రెస్ అగ్రనేతలకు వివరించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి
గతంలో బిఆర్ఎస్ తరఫున సుదీర్ఘ కాలం పనిచేసిన కేకే, తన కుమార్తె గద్వాల విజయలక్ష్మితో కలిసి తిరిగి సొంత గూడు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. చేరిక సమయంలోనే మంత్రి పదవిపై కీలకమైన ప్రతిపాదనలు జరిగాయని, ప్రస్తుత మంత్రివర్గ విస్తరణ లేదా మార్పుల నేపథ్యంలో ఆ హామీని నెరవేర్చుకునేందుకు కేకే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.