నయా దోపిడీకి తెరదీసిన ముఠాలు!
హైదరాబాద్: సాంప్రదాయ జేబుదొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలను జోడించి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త 'హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్' ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉండే సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా ఈ ముఠాలు వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బస్టాండ్లు, రద్దీ బస్సుల్లో ప్రయాణికులు ఫోన్ అన్లాక్ చేసే సమయంలో పిన్ లేదా ప్యాటర్న్ను నిశితంగా గమనించి, ఆ తర్వాత ఫోన్లను చోరీ చేస్తున్నారు. ఫోన్ లాక్ తెలియకపోతే.. బాధితులు కాల్ చేసినప్పుడు ‘మేము బస్సు కండక్టర్లం.. ఫోన్ ఇచ్చేస్తాం’ అంటూ లేదా ‘ఓనర్ వెరిఫికేషన్’ పేరిట మాయమాటలు చెప్పి స్క్రీన్ పాస్వర్డ్లు రాబడుతున్నారు.
ఫోన్ గ్యాలరీ, నోట్స్ యాప్లలో దాచుకున్న డెబిట్ కార్డులు, ఆధార్/పాన్ వివరాలను సేకరిస్తున్నారు. దొంగిలించిన సిమ్ కార్డు ద్వారా వచ్చే ఓటీపీలతో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు రీసెట్ చేసి, డబ్బులను ఆన్లైన్ గేమింగ్ యాప్స్ మరియు మ్యూల్ అకౌంట్లకు మళ్లించి విత్డ్రా చేస్తున్నారు.
ఈ తరహా నేరాలపై స్పందించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ పోయినప్పుడు ఎవరైనా కాల్ చేసి ఇచ్చేస్తామని చెప్పినా, ఎట్టిపరిస్థితుల్లోనూ స్క్రీన్ లాక్ పిన్, ఓటీపీలు ఎవరికీ చెప్పకండి. ఏటీఎం కార్డులు, బ్యాంకు పాస్బుక్, ఆధార్/పాన్ కార్డుల ఫోటోలను ఫోన్ గ్యాలరీలో లేదా నోట్స్ యాప్లలో ఎప్పుడూ సేవ్ చేయవద్దు.
ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డును, బ్యాంక్/యూపీఐ సేవలను తక్షణమే బ్లాక్ చేయించాలి. అలాగే [ceir.gov.in](http://ceir.gov.in) పోర్టల్లో ఫోన్ను బ్లాక్ చేయండి. సైబర్ మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా [cybercrime.gov.in](http://cybercrime.gov.in) పోర్టల్లో ఫిర్యాదు చేయండి. ఇంట్లోని పెద్దలకు, సీనియర్ సిటిజన్లకు ఈ కొత్త తరహా మోసాల గురించి వివరించి అప్రమత్తం చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.