సాంప్రదాయ కళాకారుల అభివృద్ధికి పీఎం విశ్వకర్మ పథకం
మూడేళ్లలో 30 లక్షల మంది నమోదు
న్యూఢిల్లీ: దేశంలోని సాంప్రదాయ కళాకారులు, చేతివృత్తుల వారికి పూర్తిస్థాయి మద్దతునందించే పీఎం విశ్వకర్మ పథకం మూడేళ్లు పూర్తి చేసుకుని 30 లక్షల మంది లబ్ధిదారుల నమోదు లక్ష్యాన్ని సాధించింది. 2023 సెప్టెంబర్ 17న రూ.13,000 కోట్ల కేటాయింపుతో ప్రారంభమైన ఈ పథకం సమ్మాన్, సమర్థ్య, సమృద్ధి అనే మూడు మూలస్తంభాల ఆధారంగా 18 సాంప్రదాయ వృత్తుల వారికి గుర్తింపు, నైపుణ్య శిక్షణ, ఉచిత టూల్కిట్లు, పూచీకత్తు లేని రుణాలు, మార్కెటింగ్ సహాయాన్ని అందిస్తోంది.
ఈ పథకం కింద ఇప్పటివరకు 24.37 లక్షల మంది కళాకారులు నైపుణ్య శిక్షణ పొందగా, 18.16 లక్షల మందికి రూ.15,000 విలువైన ఆధునిక టూల్కిట్లు అందాయి. రోజుకు రూ.500 స్టైఫండ్తో పాటు 5 శాతం రాయితీ వడ్డీకే మొదటి విడతలో రూ.1 లక్ష, రెండో విడతలో రూ.2 లక్షల పూచీకత్తు లేని రుణాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.5,316 కోట్ల విలువైన 6.19 లక్షల రుణాలు మంజూరయ్యాయి.
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రతినెలా గరిష్టంగా 100 లావాదేవీల వరకు ప్రతీ లావాదేవీకి రూపాయి చొప్పున ఇప్పటివరకు రూ.42 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అమెజాన్, గేమ్ (GeM), మీషో వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో 30,000 మంది లబ్ధిదారులను అనుసంధానించడమే కాకుండా, 12,000 మందికి ఏఐ సాధనాల వినియోగంలో శిక్షణ ఇచ్చారు. 18 ఏళ్లు నిండి, స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తిదారులు కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.