11 కొత్త నైపుణ్య విభాగాల్లో పోటీపడనున్న భారత్
న్యూఢిల్లీ: చైనాలోని షాంఘై వేదికగా సెప్టెంబర్ 22 నుండి 27 వరకు జరగనున్న 48వ వరల్డ్స్కిల్స్ పోటీలలో భారత్ తన ప్రతిభను చాటుకునేందుకు సిద్ధమైంది. ఈసారి తొలిసారిగా 11 కొత్త నైపుణ్య విభాగాలలో భారతదేశం అరంగేట్రం చేయనుంది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ (MSDE) నేతృత్వంలో మొత్తం 64 విభాగాలకు గాను 63 అంశాల్లో దాదాపు 70 మంది సభ్యులతో కూడిన 'టీమ్ స్కిల్ ఇండియా' బృందం ఈ పోటీలలో పాల్గొననుంది. ఇప్పటివరకు దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన బృందాలలో ఇది అత్యంత వైవిధ్యమైనదని అధికారులు తెలిపారు.
డ్రోన్ టెక్నాలజీ (అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్), ఏరోస్పేస్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇంటెలిజెంట్ సెక్యూరిటీ టెక్నాలజీ, డెంటల్ ప్రొస్థెటిక్స్, హెవీ వెహికల్ టెక్నాలజీ మరియు రిటైల్ సేల్స్ వంటి భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉన్న 11 కొత్త విభాగాలు ఈ జాబితాలో ఉన్నాయి. 2015లో 29వ ర్యాంక్లో ఉన్న భారత్, పటిష్టమైన స్కిల్ ఇండియా మిషన్ ద్వారా 2024 నాటికి 13వ స్థానానికి చేరిందని, షాంఘై పోటీలలో మెరుగైన ప్రదర్శనతో ప్రపంచ నైపుణ్య కేంద్రంగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని MSDE కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పేర్కొన్నారు.