గల్ఫ్, ఒమన్ గల్ఫ్లో వాణిజ్య నౌకలపై క్షిపణి దాడులు
దుబాయ్: పశ్చిమాసియాలో జరుగుతున్న సైనిక చర్యల నేపథ్యంలో ఉత్తర గల్ఫ్, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న అనేక వాణిజ్య నౌకలపై క్షిపణి దాడులు జరిగాయని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) బుధవారం ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని పోర్ట్ రషీద్కు 24 నాటికల్ మైళ్ల దూరంలో లంగరు వేసి ఉన్న ఒక నౌకపై క్షిపణి దాడి జరగడంతో అందులోకి నీరు చేరి, నౌక ఒకవైపుకు ఒరిగిపోయినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనల్లో ప్రాణనష్టం లేదా పర్యావరణ నష్టంపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
అమెరికా నావికాదళ యుద్ధనౌకపై జరిగిన క్షిపణి దాడుల ప్రయత్నాలకు ప్రతిగా యూఎస్ సెంట్రల్ కమాండ్ ఐదు ఇరాన్ ముడి చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసింది. ఈ చర్యకు ప్రతీకారంగా గల్ఫ్లో రెండు అమెరికా నౌకలతో పాటు ఎనిమిది చమురు ట్యాంకర్లపై తాము దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వెల్లడించారు. హోర్ముజ్ జలసంధిలోని అసురక్షిత ప్రాంతాన్ని దాటేందుకు యత్నించడం వల్లే ఈ దాడులు జరిగాయని తెలిపింది. దాడుల పరంపరతో గల్ఫ్ సముద్ర మార్గంలో నౌకాయానం అత్యంత ప్రమాదకరంగా మారింది.