అసెంబ్లీ నియమాలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉల్లంఘించారు
హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని విమర్శలు!
చండీగఢ్: హర్యానా శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మర్యాదలను, భద్రతా నియమాలను తీవ్రంగా ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.
భద్రతా సిబ్బందితో ఘర్షణ దురదృష్టకరం
ఆగస్టు 27న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు జరిగిన ఘటనపై సీఎం స్పందిస్తూ నిరసన తెలపడానికి నినాదాలతో కూడిన ప్లకార్డులను పట్టుకుని అసెంబ్లీ భవనంలోకి ప్రవేశించరాదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ సభ్యులు వాటిని తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రజాప్రతినిధుల రక్షణ, భద్రత కోసం నియమించబడిన మార్షల్స్, భద్రతా సిబ్బందితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగడం అత్యంత విచారకరమని, ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య మర్యాదలు పాటించాలి
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానిది కీలక పాత్ర అని, హక్కులతో పాటు బాధ్యతలు, మర్యాదలు కూడా వస్తాయని సీఎం సైని గుర్తుచేశారు. శాసనసభ గౌరవం, సంప్రదాయాలు మరియు భద్రతా నియమావళి చాలా కాలంగా అమలులో ఉన్నాయని, వాటిని అందరూ సమిష్టిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు నిరసనను ఈ స్థాయికి దిగజార్చడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ అని వ్యాఖ్యానించారు.