బాంబే ఆసుపత్రిలో అన్నా హజారే
పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్!
ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అనారోగ్యంతో ముంబైలోని బాంబే ఆసుపత్రిలో చేరారు. సమాచారం అందుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆసుపత్రికి చేరుకుని అన్నా హజారేను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కన్సల్టెంట్ ఫిజిషియన్, అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ గౌతమ్ భన్సాలీ అన్నా హజారే ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందించారు.
గత నెల రోజులుగా అన్నా హజారే వైరల్ జ్వరం మరియు విరేచనాలతో బాధపడుతున్నారు. దీనివల్ల ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇన్ఫెక్షన్ తీవ్రమవ్వడంతో పాటు, అది మూత్రపిండాలపై (కిడ్నీలపై) ప్రభావం చూపే సూచనలు కనిపిస్తుండటంతో మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఆయనను షిరూర్లోని ఆసుపత్రి నుండి ముంబైలోని బాంబే ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చేరే సమయానికి ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని, అయితే నిరంతర అనారోగ్యం కారణంగా కొంత బలహీనత, తీవ్ర అలసటకు గురయ్యారని డాక్టర్ గౌతమ్ భన్సాలీ వివరించారు.
ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. అన్నా హజారే త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.