22ఏ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ధరణి, భూ భారతి అక్రమాలపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలి.
22ఏ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
ధరణి, భూ భారతి అక్రమాలపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలి.
22ఏ విషయంలో మంత్రి తప్పు చేస్తే భర్తరఫ్ చేయాలి: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.
ఢిల్లీ: తెలంగాణలో గత కొన్ని రోజులుగా 22ఏ భూముల అంశంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రైతులు, పేద ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. 22ఏ భూముల విషయంలో మంత్రి తప్పు చేసి ఉంటే ఆయనను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.ధరణి, భూ భారతి వ్యవస్థల్లో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎంతమంది రైతులకు ఎంత విస్తీర్ణంలో అసైన్డ్ భూములు ఉన్నాయి, ప్రస్తుతం అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయనే వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.అసైన్డ్ చట్టాన్ని ఎత్తివేస్తారనే ప్రచారం జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రఘునందన్ రావు కోరారు. రెవెన్యూ మంత్రి ఒక విధంగా, ముఖ్యమంత్రి మరో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 22ఏ భూముల విషయంలో తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
43,440 ఎకరాలపై స్పష్టత ఇవ్వాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏ కింద 43,440 ఎకరాల భూములను చేర్చినట్లు చెబుతున్నారని, ఆ భూములు ఎక్కడ ఉన్నాయో ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని రఘునందన్ రావు అన్నారు. వాటిని 22ఏ జాబితాలో చేర్చిన వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.22ఏ జాబితాలో ఉన్న భూముల పూర్తి వివరాలను బహిరంగంగా ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించిన ఆయన, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో 22ఏ భూములపై వాస్తవాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
సింఫోనీ కాలనీ సమస్యపై ప్రస్తావన..
సింఫోనీ కాలనీలో రిజిస్ట్రేషన్ల విషయంలో సమస్యలు ఉన్నాయని రఘునందన్ రావు పేర్కొన్నారు. రెండు రిజిస్ట్రేషన్లకు రూ.2 లక్షల చొప్పున తీసుకున్నారని ఆరోపించారు. 22ఏలో భూమి ఉందని చెప్పడంతో పావని కుటుంబానికి చెందిన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కాలేదని పేర్కొన్నారు.కొండపాక వెలికట్ట గ్రామం సిద్దిపేటలో కాకుండా గజ్వేల్ ప్రాంతంలో ఉందని, రాజీవ్ రహదారి జాతీయ రహదారి కాదని అన్నారు. సంబంధిత అంశాలపై పూర్తి అవగాహనతో అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు.ఒక ప్రజా సమస్యపై బీజేపీ, బీఆర్ఎస్ మాట్లాడినంత మాత్రాన రెండు పార్టీలు ఒక్కటైనట్లు కాదని స్పష్టం చేశారు. తనకు బీఆర్ఎస్ చట్టం కాదని, కాంగ్రెస్ శత్రువు కాదని, ప్రజలకు న్యాయం జరగడమే ముఖ్యమని అన్నారు.22ఏలో ఉన్న భూములను ఎంతకాలంలో తొలగించారు, భూ భారతి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా తప్పులు జరిగాయని మంత్రి పొంగులేటి చెబుతున్న నేపథ్యంలో ఆ తప్పులు చేసిన వారెవరో గుర్తించి చర్యలు తీసుకుంటారా లేదా ప్రభుత్వం స్పష్టం చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. పేదలకు జరిగిన అన్యాయానికి పరిహారం ఇస్తారా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం వెల్లడించాలన్నారు.దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.