నేపాల్ వరద బాధితులకు సద్గురు ఓదార్పు
'విపత్తుల వెనుక భౌతిక కారణాలే తప్ప అతీంద్రియ శక్తి లేదు'
కాఠ్మండు, ఆగస్టు 30: ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతున్న నేపాల్కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు తన గాఢ సానుభూతిని, సంఘీభావాన్ని ప్రకటించారు. 'నేపాల్తో సంఘీభావం' (In Solidarity with Nepal) అనే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విపత్తు వేళ ప్రజలకు ధైర్యం చెప్పారు.
గత 20 ఏళ్లుగా నేపాల్ తన హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని ఈ సందర్భంగా సద్గురు గుర్తుచేసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దైవిక కారణాలు లేదా అతీంద్రియ శక్తులను వెతకడం సహజమని, అయితే భౌతిక ప్రపంచంలో జరిగే ప్రతీ సంఘటన భౌతిక నియమాల ప్రకారమే జరుగుతుందని శాస్త్రీయ దృక్పథాన్ని స్పష్టం చేశారు.
గత దశాబ్ద కాలంగా నేపాల్ ప్రజలు వరుసగా ఎన్నో విపత్తులను, కష్టాలను ఎదుర్కొన్నారని... ప్రతీసారి ఆపదలను ధైర్యంగా తట్టుకుని తిరిగి కోలుకున్నారని కొనియాడారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మళ్లీ పుంజుకునే నేపాల్ ప్రజల సంకల్పం, నిబద్ధత అభినందనీయమని సద్గురు పేర్కొన్నారు.