పర్యాటకాన్ని ఆదుకోవాలని నటి మనీషా కొయిరాలా విజ్ఞప్తి
కాఠ్మండు, ఆగస్టు 30: ఆకస్మిక వరదలతో కష్టాల్లో ఉన్న నేపాల్కు అండగా నిలిచేందుకు ఆధ్యాత్మిక గురువు సద్గురు నేతృత్వంలో నిర్వహించిన 'నేపాల్కు సంఘీభావం' (In Solidarity with Nepal) కార్యక్రమంలో ప్రముఖ నటి మనీషా కొయిరాలా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాలకు భూతాపమే (గ్లోబల్ వార్మింగ్) ప్రధాన కారణమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు తలెత్తకుండా నివారించేందుకు భారత్, చైనా, నేపాల్ వంటి పొరుగు దేశాలు కలిసికట్టుగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
నేపాల్ అంటే కేవలం 'విపత్తుల దేశం' అనే ముద్ర పడకూడదని ఆమె ఆకాంక్షించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల జీవనోపాధికి పర్యాటక రంగమే ఊపిరి లాంటిదని... అంతర్జాతీయ పర్యాటకులు నేపాల్ పర్యటనను కొనసాగించడం ద్వారా దేశాన్ని ఆదుకోవాలని కోరారు.
కష్టకాలంలో అంతర్జాతీయ సమాజం చూపుతున్న ప్రేమ, మద్దతు ఇలాగే కొనసాగాలని, ప్రతి ఒక్కరూ బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు రావలసిందిగా మనీషా కొయిరాలా విజ్ఞప్తి చేశారు.