విశాఖలో 'స్లినెక్స్-26' సముద్ర విన్యాసాలు
విశాఖపట్నం: భారత్, శ్రీలంక నావికాదళాల మధ్య ద్వైపాక్షిక సముద్ర సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 13వ ఎడిషన్ 'స్లినెక్స్-26' (SLINEX-26) విన్యాసాలు సెప్టెంబర్ 17 నుండి 21 వరకు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య సముద్ర సహకారం, పరస్పర కార్యాచరణ మరియు అవగాహనను పెంచేందుకు 2005లో ప్రారంభమైన ఈ ద్వైపాక్షిక విన్యాసాలు అత్యంత కీలకమైన వేదికగా రూపుదిద్దుకున్నాయి.
తూర్పు నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విన్యాసాలు రెండు దశల్లో (హార్బర్ ఫేజ్, సీ ఫేజ్) కొనసాగుతాయి. భారత నావికాదళం తరఫున స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సబ్మెరైన్ విధ్వంసక నౌక 'ఐఎన్ఎస్ కవరత్తి', ఫ్లీట్ ట్యాంకర్ 'ఐఎన్ఎస్ జ్యోతి' పాల్గొంటుండగా, శ్రీలంక నావికాదళం నుండి 'ఎస్ఎల్ఎన్ఎస్ సింధూరాల' ప్రాతినిధ్యం వహిస్తోంది. ఐఎన్ఎస్ కవరత్తి వేదికగా ఎస్ఎల్ఎన్ఎస్ సింధూరాల సిబ్బందికి స్వాగతం పలకడంతో హార్బర్ ఫేజ్ ప్రారంభమైంది.
హార్బర్ దశలో భాగంగా ఇరు దేశాల నావికాదళ అధికారులు వృత్తిపరమైన చర్చలు, పరస్పర నౌకల సందర్శనలు, ఉత్తమ పనితీరు పద్ధతుల మార్పిడితో పాటు యోగా, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ప్రారంభమయ్యే 'సీ ఫేజ్' (సముద్ర దశ)లో ఉమ్మడి సైనిక వ్యూహాలు, సమన్వయ కార్యకలాపాల ద్వారా పరస్పర సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తారు.
భారతదేశపు 'మహాసాగర్' దార్శనికతకు అనుగుణంగా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సురక్షితమైన, స్థిరమైన, సమ్మిళిత సముద్ర పర్యావరణాన్ని పెంపొందించడంలో ఈ విన్యాసాలు ఎంతగానో దోహదపడతాయని అధికారులు తెలిపారు.