డిసెంబర్లో మూడు జిల్లాల దీనీ ఇజ్తిమా-మంత్రి ఎన్ఎండి ఫారూక్
-మంత్రి ఎన్ఎండి ఫారూక్ తబ్లిగీ జమాత్ ప్రతినిధుల కీలక భేటీ
-మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి ఫరూక్ సానుకూల హామీ
నంద్యాల అర్బన్:
కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో రాబోయే డిసెంబర్ నెలలో నిర్వహించతలపెట్టిన మూడు రోజుల భారీ 'దీనీ ఇజ్తిమా' ఏర్పాట్లపై తబ్లిగీ జమాత్ జిల్లా స్థాయి ముఖ్య ప్రతినిధుల బృందం రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జనాబ్ ఎన్ఎండి ఫారూక్ సాహెబ్ తో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో ఇజ్తిమా నిర్వహణకు అవసరమైన స్థల ఎంపిక, ఏర్పాట్లను ప్రతినిధులు మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు. మూడు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రశాంతమైన విశాల స్థలంతో పాటు తాగునీరు, సాధారణ అవసరాలకు సరిపడా నీటి సరఫరా, నిరంతర విద్యుత్, డ్రైనేజీ తదితర ప్రాథమిక మౌలిక వసతులు కల్పించాలని మంత్రి ని కోరారు.
తబ్లిగీ జమాత్ వినతులపై మంత్రి ఎన్ఎండి ఫారూక్ సానుకూలంగా స్పందించారు. ఇజ్తిమా విజయవంతానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నిర్వహణకు అనువైన స్థలాన్ని ముందుగా గుర్తించాలని సూచిస్తూ... గోరకల్ రిజర్వాయర్ పరిసరాలు లేదా సమృద్ధిగా నీటి వసతి, ప్రయాణ సౌకర్యాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించాలని ప్రతినిధులకు సూచించారు. స్థల ఎంపిక ఖరారైన వెంటనే పనులను వేగవంతం చేసి అన్ని సదుపాయాలు సమకూరుస్తామని స్పష్టం చేశారు. మంత్రి ఫరూక్ ఇచ్చిన హామీ పట్ల తబ్లిగీ జమాత్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో తబ్లిగీ జమాత్ అమీర్ ముఫ్తీ, మహమ్మద్ రఫీ సాహెబ్, ఖాసిమీ, ప్రతినిధులు జనాబ్ సలీం సాహెబ్, జనాబ్ అబ్దుస్సలాం సాహెబ్, ఖురైష్ హల్కా ప్రతినిధి జనాబ్ బిలాల్ అహ్మద్ సాహెబ్, మజ్లిస్ ఉలమా వల్ ఐమ్మా జిల్లా అధ్యక్షులు ఖారీ ఖాజీ మహమ్మద్ అమ్జద్ బాషా సిద్దిఖీ సాహెబ్, సున్నీ మసీదు అధ్యక్షులు జనాబ్ కలీమా ఇస్మాయిల్ సాహెబ్, జామా మసీదు సెంటర్ అధ్యక్షులు జనాబ్ అబ్దుల్ హక్ సాహెబ్, జామా మసీదు ఉపాధ్యక్షులు జనాబ్ మహమ్మద్ ఇలియాస్ సాహెబ్ (చాబోల్) తదితరులు పాల్గొన్నారు.