తిమ్మాపూర్ ఎస్బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి భారీ చోరీ…
సూర్య, తిమ్మాపూర్ ::
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ స్టేజీ వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పక్కా పథకం ప్రకారమే వచ్చిన దొంగల ముఠా ఏటీఎంను ధ్వంసం చేసి భారీగా నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.అర్ధరాత్రి సమయంలో తిమ్మాపూర్ స్టేజీ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించిన దుండగులు అత్యంత తెలివిగా చోరీకి పాల్పడ్డారు.చోరీకి ముందు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ఏటీఎం లోపల ఉన్న సీసీ కెమెరాలపై నల్లటి స్ప్రే చల్లారు.అనంతరం గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎం యంత్రాన్ని కట్ చేసి, అందులో ఉన్న నగదును అపహరించుకొని పరారయ్యారు.ఆదివారం ఉదయం వాకింగ్కు వెళ్తున్న స్థానికులు ఏటీఎం మిషన్ ధ్వంసమై ఉండటాన్ని గమనించారు. లోపల చోరీ జరిగినట్లు గుర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో కలిసి ఆధారాలు సేకరించారు.
దుండగులు స్కార్పియో వాహనంలో వచ్చి అతి తక్కువ సమయంలోనే చోరీ పూర్తి చేసి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఏటీఎం పరిసర ప్రాంతాల్లోని, రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు.చోరీకి గురైన మొత్తం నగదు ఎంత అనేదానిపై బ్యాంకు అధికారులు పరిశీలన జరుపుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.