కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు
కూలిపోయిన కాళేశ్వరం దగ్గరకు సిగ్గు లేకుండా ఎలా వెళ్తారు..?
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుకుంటారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలే నేటి సమస్యలకు ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు కేసీఆర్ వెళ్లడం ఏంటని ప్రశ్నించారు.
రాష్ట్రంలో నీటి సమస్యకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ఉత్తమ్ పేర్కొన్నారు. ఒకటి కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ రంగానికి జరిగిన నష్టం కాగా.. మరొకటి ఎల్నినో ప్రభావం అని చెప్పారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత, ప్రణాళికలను పట్టించుకోకుండా వ్యవహరించిందని విమర్శించారు.
కేసీఆర్ గతంలో బూతులు మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయనను హీరోగా భావించారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే భాషను కేసీఆర్పై ఉపయోగిస్తే ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు. తమ నాయకుడికి ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయం అన్నట్లుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఇరిగేషన్ శాఖను కేసీఆర్ పూర్తిగా నాశనం చేశారని ఉత్తమ్ ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న లోపాలపై ఇప్పటికే విచారణ జరుగుతోందని, వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోందని ఉత్తమ్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితిని సమీక్షిస్తూ రైతులకు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.