ఎంపీడీవో కార్యాలయానికి తాళం... బిఆర్ఎస్ నిరసన
ప్రజావాణి రోజే అధికారుల గైర్హాజరు.. సస్పెండ్ చేయాలని డిమాండ్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: కోటిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారుల సమయపాలనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 10.30 గంటలు దాటినా కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు.
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఉన్నప్పటికీ ఎంపీడీవో, ఎంపీవోతో పాటు పలువురు సిబ్బంది సమయానికి కార్యాలయానికి హాజరు కాలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. 10.30 గంటలు దాటినా కార్యాలయంలో అటెండర్ మాత్రమే అందుబాటులో ఉన్నారని తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించేందుకు కార్యాలయానికి వస్తుంటే అధికారులు సమయపాలన పాటించకపోవడం బాధ్యతారాహిత్యమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. విధులకు సమయానికి హాజరుకాని అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుందరి అనిల్, మాజీ సర్పంచ్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.