రైతుబీమా నిలిపివేత
దిక్కుతోచని స్థితిలో బాధిత రైతు కుటుంబాలు
వెల్దండ: రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలిచిన 'రైతుబీమా' పథకం నిలిచిపోవడంతో బాధిత అన్నదాత కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత ఎనిమిదేళ్లుగా రైతు మరణిస్తే ఆయన కుటుంబానికి లభించే రూ. 5 లక్షల భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
దీనికి ఉదాహరణగా నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బర్కత్పల్లి గ్రామానికి చెందిన దళిత రైతు ఒర్సు రాంచందర్ (45) గత నెల 29న గుండెపోటుతో మృతి చెందారు. అర ఎకరం భూమి ఉన్న రాంచందర్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి రైతుబీమా పరిహారం అందుతుందనే ఆశతో ఆయన మిత్రులు స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి (AEO)ని కలవగా, ఆగస్టు 14 నుంచే రైతుబీమా పథకం నిలిచిపోయిందని, క్లెయిమ్ కాదని చెప్పడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది.
2018 ఆగస్టు 15న కేసీఆర్ హయాంలో ప్రారంభమైన ఈ పథకం కింద గుంట భూమి ఉన్న రైతు మరణించినా రూ. 5 లక్షల బీమా పరిహారం అందేలా నిబంధనలు రూపొందించారు. ప్రభుత్వం ఏటా సుమారు 42.16 లక్షల మంది రైతుల కోసం దాదాపు రూ. 1,400 కోట్ల ప్రీమియం చెల్లిస్తూ వచ్చింది. 2018-19 నుంచి 2025-26 వరకు వివిధ కారణాలతో మరణించిన 1,86,363 మంది రైతుల కుటుంబాలకు మొత్తంగా రూ. 9,107.80 కోట్ల బీమా పరిహారం అందింది.
రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే ఇటువంటి సంక్షేమ పథకాన్ని పునరుద్ధరించి, మరణించిన రైతు కుటుంబాలకు తక్షణమే బీమా పరిహారం అందించాలని బాధిత కుటుంబాలు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.