అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే!
అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో రానున్న రెండు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి వాతావరణంపై ప్రభావం చూపుతోంది. మరోవైపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో సోమవారం వరకు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. పిడుగులు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగవచ్చని, గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా. రాయలసీమలోనూ సోమ, మంగళవారాల్లో చెదురుమదురు వర్షాలు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్షాలతో పాటు కొన్ని చోట్ల వేడి, తేమ కారణంగా అసౌకర్యకర వాతావరణం ఏర్పడొచ్చని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలోనూ వర్ష సూచన కొనసాగుతోంది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నట్లు సమాచారం. మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో వాహనదారులు, ప్రజలు జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచిస్తున్నారు.