కేటీఆర్ ముందుగా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి… సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి…
సూర్య కరీంనగర్ ప్రతినిధి
కరీంనగర్లో ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్పై మాట్లాడేందుకు వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుగా తమ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అంశాలపై సమాధానం చెప్పాలని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
2023 డిసెంబర్ 3 నాటికి సుమారు రూ.5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు పేరుకుపోయాయో చెప్పాలన్నారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని, గ్రూప్ పరీక్షల లీకేజీలతో నిరుద్యోగులు నష్టపోయారని ఆరోపించారు.
2014, 2018 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య హామీని కూడా నెరవేర్చలేదన్నారు. తమ హయాంలో యూనివర్సిటీలకు పూర్తిస్థాయి వైస్చాన్స్లర్లను నియమించకుండా ఇన్చార్జ్లతో ఎందుకు కొనసాగించారో కేటీఆర్ ముందుగా ప్రజలకు వివరించాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.