ఢిల్లీ పీడబ్ల్యూడీకి ప్రత్యేక ఇంజనీరింగ్ కేడర్
కేంద్రం ఆమోదంపై సీఎం రేఖా గుప్తా హర్షం
న్యూఢిల్లీ: ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) కోసం ప్రత్యేక ఇంజనీరింగ్ కేడర్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మూడు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడటంతో రాజధానిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమవుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
నూతన నిర్ణయం ప్రకారం, ఢిల్లీ పీడబ్ల్యూడీ పరిధిలోని 36 విభాగాల్లో ఉన్న 3,214 మంజూరైన ఇంజనీరింగ్ పోస్టులను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (CPWD) కేడర్ నుండి వేరు చేసి, స్వతంత్ర కేడర్గా మారుస్తారు. దీనివల్ల ఖాళీల భర్తీ వేగవంతమవ్వడమే కాకుండా, ప్రాజెక్టుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలోని 11 జిల్లాల్లో కొత్త సచివాలయాలు, మినీ-సచివాలయాలు, మండీలు, క్రీడా ప్రాంగణాలు మరియు రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి ఈ స్వతంత్ర కేడర్ ఎంతో ఉపయోగపడనుంది.