ఫిలిప్పీన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్ జూనియర్తో ఆదివారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఆసియాన్) ప్రస్తుత అధ్యక్ష హోదాలో ఈ సదస్సుకు హాజరైన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ఈ భేటీలో రక్షణ-భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, రైల్వే మౌలిక సదుపాయాలు, ఫిన్టెక్, విద్య, పర్యాటకం, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇరు నేతలు అంగీకరించారు.
ఆగస్టు 2025లో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యం ఆధారంగా సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అలాగే, భారతదేశం నేతృత్వంలోని 'కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (CDRI)'లో చేరాలన్న ఫిలిప్పీన్స్ నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకుంటూ, వ్యూహాత్మక భాగస్వామ్యానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.