భారత్లో బ్రిక్స్ ప్రెసిడెన్సీ అద్భుతం
బ్రిక్స్ డబ్ల్యూబీఏ చైర్ అవర్నా జైన్ ప్రశంసలు
న్యూఢిల్లీ: భారతదేశం వహిస్తున్న బ్రిక్స్ (BRICS) అధ్యక్షత "ఖచ్చితంగా అద్భుతం" అని బ్రిక్స్ మహిళా వ్యాపార కూటమి (WBA) చైర్పర్సన్ అవర్నా జైన్ కొనియాడారు. భారతదేశపు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) నమూనాతో రూపొందించిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై తమ సంస్థ సిద్ధం చేసిన ప్రత్యేక నాలెడ్జ్ పేపర్ కృషిని ఆమె ఈ సందర్భంగా హైలైట్ చేశారు.
సెప్టెంబర్ 12-13 తేదీలలో ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో, న్యూఢిల్లీలో నిర్వహించిన 'బ్రిక్స్ డబ్ల్యూబీఏ మహిళా నేతృత్వంలోని అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం 2026' అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.
ఈ శిఖరాగ్ర సమావేశంలో జైన్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన నడుస్తున్న ఈ కూటమి ఆర్థిక, అభివృద్ధి అజెండా అంతటికీ 'మానవత్వానికి ప్రథమ ప్రాధాన్యత' (Humanity First) అనే సూత్రమే మూలస్తంభంగా నిలిచిందని పేర్కొన్నారు. 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఒక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించిన ఆమె, జ్ఞానాన్ని పంచుకోవడం మరియు సరిహద్దుల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా మరో ఏడు నాలెడ్జ్ పేపర్లు విడుదల కానున్నాయని వెల్లడించారు.
ఈ సదస్సులో భాగంగా ఐదు ప్రధాన అంశాలపై (STEM రంగంలో మహిళల పురోగతి, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ ఆరోగ్యం, టెలిమెడిసిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు హెల్త్కేర్ విస్తరణ) ప్యానెల్ చర్చలు నిర్వహించారు. అలాగే “డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: మహిళా నేతృత్వంలోని అభివృద్ధిని సులభతరం చేయడం”, “యాక్సెస్కు అతీతంగా: బ్రిక్స్ దేశాలలో మహిళల ఆర్థిక సాధికారత” అనే రెండు కీలక పరిశోధనా పత్రాలను కూడా ఆవిష్కరించారు.