మలేషియా, తైమూర్-లెస్టే, మయన్మార్లతో భారత్ ద్వైపాక్షిక వ్యవసాయ చర్చలు
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో పరిశోధనలు, సాంకేతికత, ఆహార భద్రత మరియు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించేందుకు మలేషియా, తైమూర్-లెస్టే, మయన్మార్ దేశాలతో భారత్ కీలక చర్చలు జరిపింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం న్యూఢిల్లీలో ఆయా దేశాల వ్యవసాయ మంత్రులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. 9వ ఆసియాన్-భారత్ వ్యవసాయ, అటవీ మంత్రివర్గ సమావేశం (9th AIMMAF) సందర్భంగా ఈ భేటీలు చోటుచేసుకున్నాయి.
మలేషియా వ్యవసాయ మంత్రి మొహమ్మద్ బిన్ సాబుతో జరిగిన సమావేశంలో ఉమ్మడి వ్యవసాయ పరిశోధనలు, నూతన సాంకేతికతల మార్పిడితో పాటు అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోవడంపై చర్చించారు. తైమూర్-లెస్టే మంత్రి మార్కోస్ డా క్రూజ్తో భేటీ అయిన చౌహాన్, ఆ దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, వ్యవసాయ ఆవిష్కరణల సామర్థ్యాన్ని పెంచడానికి భారత శాస్త్రవేత్తలు, నిపుణుల సేవలను అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. అలాగే మయన్మార్ మంత్రి మిన్ నాంగ్తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల సరిహద్దు సంబంధాలను ప్రస్తావిస్తూ పప్పుధాన్యాలు, పత్తి, పాడి పరిశ్రమ, వ్యవసాయ విద్య రంగాలలో వ్యాపార అవకాశాలను పెంచుకోవడానికి వీలుగా తుది దశలో ఉన్న ప్రతిపాదిత ఎంఓయూపై విస్తృతంగా చర్చించారు.