ఢిల్లీ-ఎన్సిఆర్లో మరో విడత వర్షాలు
సాధారణం కంటే తగ్గనున్న ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: జాతీయ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన ఎన్సీఆర్ (NCR)లో శనివారం ఉదయం మేఘావృతమైన ఆకాశం, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలోర్పడిన అల్పపీడనం కారణంగా ఈ తడి వాతావరణం ఏర్పడిందని ఐఎమ్డి తెలిపింది. రాబోయే రెండు రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది.
వర్షాల ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రత 29°C నుండి 31°C, కనిష్ట ఉష్ణోగ్రత 24°C నుండి 26°C మధ్య నమోదు కావచ్చు. ఇది సాధారణ స్థాయి కంటే తక్కువ. నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్లలో పగటిపూట రెండు విడతలుగా (ఉదయం, సాయంత్రం) ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. సెప్టెంబర్ 6 నుండి వర్షపాతం క్రమంగా తగ్గుతుందని, సెప్టెంబర్ 7 నుండి 10 వరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై పొడి వాతావరణం ఏర్పడుతుందని ఐఎమ్డి అంచనా వేసింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు మళ్లీ 33°C - 35°Cకి చేరుకుంటాయి.
వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ట్రాఫిక్ సూచనలను పాటించాలని అధికారులు సూచించారు.