నేడు 48 మంది ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు
ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం) ఆధ్వర్యంలో ప్రతిఏటా ఈ పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది.
జూన్ 15 నుంచి జూలై 20 వరకు ఆన్లైన్ స్వీయ నామినేషన్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించి, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మూడు దశల్లో కఠినమైన మూల్యాంకనం జరిపి విజేతలను ఎంపిక చేశారు. ఎంపికైన 48 మంది ఉపాధ్యాయులలో 26 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. వీరు 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు మరియు 6 కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఎంపికయ్యారు. విద్యార్థుల అభివృద్ధి, పాఠశాల విద్య నాణ్యతా ప్రమాణాల పెంపునకు అవార్డు గ్రహీతలు చేసిన విశేష కృషిని వివరిస్తూ రూపొందించిన లఘు డాక్యుమెంటరీలను ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు.
జాతీయ స్థాయి పురస్కారాలతో పాటు పలు రాష్ట్రాల్లోనూ ఉపాధ్యాయ దినోత్సవ పురస్కారాలను అందజేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో విద్యారంగానికి సేవలు అందించిన 26 మంది ఉపాధ్యాయులకు (21 మంది పాఠశాల, 5 గురు కళాశాల) రాష్ట్ర అవార్డులు ప్రకటించారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగే కార్యక్రమంలో 81 మంది ఉపాధ్యాయులకు (ప్రాథమిక విద్యా శాఖ నుండి 61, మాధ్యమిక శాఖ నుండి 20) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా అవార్డులను అందజేయనున్నారు.