జీ20 సమావేశంలో ఏఐ, సెమీకండక్టర్లపై ప్రపంచ సహకారానికి భారత్ పిలుపు
కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద నేతృత్వం
చాపెల్ హిల్ (యూఎస్):ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్లు, డిజిటల్ టెక్నాలజీలు మరియు వర్ధమాన సాంకేతికతలలో లోతైన అంతర్జాతీయ సహకారం అవసరమని భారత్ స్పష్టం చేసింది. నార్త్ కరోలినాలోని చాపెల్ హిల్లో సెప్టెంబర్ 1-2 తేదీలలో నిర్వహించిన జీ20 ఆవిష్కరణల మంత్రుల సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం పాల్గొంది. అమెరికా వాణిజ్య శాఖ, వైట్ హౌస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశం, ఆవిష్కరణలపై జీ20 మంత్రుల ఉమ్మడి ప్రకటనతో ముగిసింది.
ఈ సమావేశంలో వర్ధమాన సాంకేతికతలను విశ్వసనీయంగా స్వీకరించడం, ప్రాథమిక పరిశోధనలు, వాణిజ్యీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో 'కరోలినా ప్రిన్సిపల్స్ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్'తో పాటు ఏఐ ప్రాస్పెరిటీ కాంపాక్ట్ను మంత్రులు ఆమోదించారు. ఆవిష్కరణల అనుకూల విధానాలు, సాంకేతిక శ్రామిక శక్తి అభివృద్ధి, ఏఐ మేధో సంపత్తి విధానాలు, సరఫరా గొలుసులలో పెట్టుబడులు వంటి ఆరు కీలక రంగాలపై జీ20 దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
సమావేశం సందర్భంగా కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద పలు దేశాల సీనియర్ ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్తో జరిపిన భేటీలో 'ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0'లో అమెరికా పెట్టుబడులను పెంచాలని, ఏఐ భద్రతా యంత్రాంగాల్లో బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించాలని కోరారు. అలాగే ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు టామ్ బ్రౌన్తో ఏఐ బెంచ్మార్క్ల అభివృద్ధిపై, ఆఫ్రికన్ యూనియన్ ప్రతినిధులు, ఈయూ, ఫ్రాన్స్, జర్మనీ అధికారులతో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI), ఆవిష్కరణలపై చర్చించారు. అనంతరం డ్యూక్ విశ్వవిద్యాలయం, ప్రాట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లోని రోబోటిక్స్ ల్యాబ్లను సందర్శించి పరిశోధకులతో సంభాషించారు. ప్రపంచ సాంకేతిక అజెండాను రూపొందించడంలో భారతదేశం క్రియాశీలక పాత్ర పోషిస్తోందని ఈ పర్యటన పునరుద్ఘాటించింది.