ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్యవర్తులపై కఠిన చర్యలు
380 మందికి పైగా బ్రోకర్ల అరెస్ట్ వెల్లడించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ
గువహతి: సాధారణ పౌరులు తమ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఎదురవుతున్న బ్రోకర్లు, మధ్యవర్తుల వ్యవస్థపై అస్సాం ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అస్సాంలోని పోలీస్ స్టేషన్లలో 400 మందికి పైగా మధ్యవర్తులు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గత ఆరు నెలలుగా తమ దృష్టిలో ఉందని, విచారణ చేపట్టి వారి పేర్లు మరియు వివరాలను నిర్ధారించుకున్న తర్వాత గత రెండు రోజుల్లో 380 మందికి పైగా బ్రోకర్లను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం వెల్లడించారు.
మిగిలిన మధ్యవర్తులను కూడా అరెస్టు చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఈ చర్యలు కేవలం పోలీస్ స్టేషన్లకే పరిమితం కావని ఆయన స్పష్టం చేశారు. ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఎవరైనా మధ్యవర్తులు ఉన్నట్లు తెలిస్తే తక్షణమే అరెస్టులు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాకుండా, ప్రజలు తమకు ఎదురయ్యే బ్రోకర్ల పేర్లు, వివరాలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేసేందుకు అస్సాం పోలీస్ స్పెషల్ బ్రాంచ్ త్వరలోనే ఒక ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించనుందని తెలిపారు. ఆరోపణలు నిజమని తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.