సత్య సాయి జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన కరువు చెట్లు పరిశీలించిన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
ధర్మవరం (సత్యసాయి జిల్లా): ఉమ్మడి అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల నాటి దుర్భర కరువు పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం గుమ్మలకుంటలో ఉద్యాన పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు.గుమ్మలకుంటలో బత్తాయి (చిని) తోటలను పరిశీలించిన సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవరగుడి జగదీష్లు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తోట ఎండిపోవడంతో రైతు నాగిరెడ్డి కన్నీటిపర్యూరవుతూ.. ప్రభుత్వం ఆదుకోకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్యే శరణమంటూ రోదించడం అక్కడివారందరినీ కలచివేసింది.
ఈ సందర్భంగా కే. రామకృష్ణ మాట్లాడుతూ, ఉమ్మడి అనంతపురం జిల్లాను కరువు మండలంగా, ఈ విపత్కర పరిస్థితిని 'జాతీయ విపత్తు'గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, స్థానిక సీపీఐ నాయకులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బగ్గిరి బైపరెడ్డన్న, గంటాపురం బాబప్ప, సండ్ర రామకృష్ణతో పాటు పలువురు గ్రామస్తులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని రైతన్నలకు సంఘీభావం తెలిపారు.