ఇకపై ఫాస్టాగ్ నుంచే నేరుగా ట్రాఫిక్ చలాన్లు కట్?
తెలంగాణలో కొత్త నిర్ణయం
హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి పెండింగ్ చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించే వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారు గడువులోపు చలాన్ కట్టకపోతే, నేరుగా వారి 'ఫాస్టాగ్' (FASTag) ఖాతా నుంచే సొమ్మును కట్ చేసే కొత్త పద్ధతిని అమలు చేయడానికి ప్రణాళికలు వేస్తోంది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) ఈ కొత్త ప్రక్రియ అమలుపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)తో పాటు నగర పరిధిలోని ప్రధాన రహదారులపై ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థను ట్రాఫిక్ చలాన్ల డేటాబెస్తో అనుసంధానించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
వాహనదారులు నిర్ణీత వ్యవధిలో చలాన్లను చెల్లించకపోతే, టోల్ ప్లాజాల వద్ద లేదా ఫాస్టాగ్ వాలెట్ నుంచి పెండింగ్ జరిమానా మొత్తం స్వయంచాలకంగా (Auto-debit) కట్ అవుతుంది.
ఈ కొత్త విధానం అమలులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గడంతో పాటు, కోట్ల రూపాయల పెండింగ్ చలాన్ల వసూలు సులువవుతుందని అధికారులు భావిస్తున్నారు.