‘ఇరాన్ ఆర్థిక జీవనాధారాన్ని తెంచడమే లక్ష్యం’
4 భారతీయ సంస్థలు సహా 60 నెట్వర్క్లపై అమెరికా ఆంక్షలు!
వాషింగ్టన్: ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చమురు వాణిజ్యానికి, సైనిక కార్యకలాపాలకు సహకరిస్తున్న ఆర్థిక నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రభుత్వం భారీ ఎత్తున ఆర్థిక ఆంక్షలు విధించింది. ఇందులో 4 భారతీయ సంస్థలతో పాటు వివిధ దేశాలకు చెందిన దాదాపు 60 మంది వ్యక్తులు, కంపెనీలు మరియు నౌకలు ఉన్నాయి. ఇరాన్తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ఆరు నెలలకు చేరుకున్న వేళ, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్న డిజిటల్ ఆస్తులు (Cryptocurrency), సాంకేతికత, బంగారం, విమానయానం మరియు షిప్పింగ్ రంగాలపై అమెరికా ప్రత్యేక దృష్టి సారించింది. టెహ్రాన్ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి చమురు ఆదాయాన్ని పొందే, నిధులను తరలించే మరియు సాంకేతికతను సమకూర్చుకునే మార్గాలన్నింటినీ పూర్తిగా మూసివేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం.
ఇరాన్తో లావాదేవీలు కొనసాగించే ఏ ప్రభుత్వమైనా, వ్యాపార సంస్థలైనా అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి తీవ్ర ఒంటరితనాన్ని మరియు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బెస్సెంట్ స్పష్టం చేశారు. ఈ చర్యను అమెరికా చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆర్థిక దాడిగా ట్రెజరీ డిపార్ట్మెంట్ అభివర్ణించింది. ఇరాన్ నిరంకుశ పాలన పూర్తిగా ఒంటరిగా మారే వరకు తమ దాడులు కొనసాగుతాయని వాషింగ్టన్ తెలిపింది.