ఇమ్రాన్ ఖాన్ సోదరి దాఖలు చేసిన ధిక్కార పిటిషన్
సెప్టెంబర్ 16న పాకిస్తాన్ సుప్రీంకోర్టు విచారణ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, ఆయన చికిత్సకు సంబంధించిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ సోదరి ఉజ్మా ఖాన్ పాకిస్తాన్ ప్రభుత్వంపై దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ను సెప్టెంబర్ 16న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించినట్లు 'ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్' వెల్లడించింది.
జస్టిస్ షాహిద్ వహీద్, జస్టిస్ నయీమ్ అక్తర్ ఆఫ్ఘన్ మరియు జస్టిస్ ఇష్తియాక్ ఇబ్రహీంలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
ఆదియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో, ఆయనను రెండు రోజుల్లోగా 'షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రి'కి తరలించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. అయితే, ప్రభుత్వం ఈ ఆదేశాలను అమలు చేయలేదని ఉజ్మా ఖాన్ ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ వారంలోనే అత్యవసర విచారణ జరపాలని ఉజ్మా కోరగా, కోర్టులో ఇప్పటికే 94 క్రిమినల్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నందున త్వరిత విచారణ దరఖాస్తును రిజిస్ట్రార్ కార్యాలయం తిరస్కరించింది.
ఆగస్టు 18న జారీ చేసిన ప్రధాన కేసు విచారణ ఇప్పటికే సెప్టెంబర్ 16కు నిర్ణయించి ఉండటంతో, ఈ ధిక్కార పిటిషన్ను కూడా అదే రోజున ప్రధాన కేసుతో కలిపి విచారిస్తామని రిజిస్ట్రార్ కార్యాలయం స్పష్టం చేసింది.కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం నిరాకరించడంపై ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.