telanagana
శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి… సీపీ గౌష్ ఆలం
సూర్య కరీంనగర్ ప్రతినిధి :
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పటిష్ట బందోబస్తు, భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాలంటీర్లు అందుబాటులో ఉండి పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రధాన నిమజ్జన ఘాట్ల వద్ద భారీ క్రేన్లు, విద్యుత్ దీపాలు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రూట్ మ్యాప్ అమలు చేస్తున్నామని, అడ్డుగా ఉన్న విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మలను తొలగించినట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినా, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సోషల్ మీడియాలో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ గణేష్ నవరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించాలని సీపీ కోరారు.