ఢిల్లీకి చేరుకున్న డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్, గ్లోబల్ లీడర్లు
న్యూఢిల్లీ: భారత్ మండపంలో శనివారం ప్రారంభమైన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆయన రాక ప్రపంచ ఆరోగ్య రక్షణ, సమిష్టి అభివృద్ధికి దోహదపడుతుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) పేర్కొంది. టెడ్రోస్తో పాటు బెలారస్ విదేశాంగ మంత్రి మాగ్జిమ్ రైజెన్కోవ్, డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ న్గోజీ ఒకోంజో-ఇవేలా, క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ పర్రిల్లా, ఆసియాన్ అధ్యక్ష హోదాలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ తదితర విదేశీ ప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు.
సెప్టెంబర్ 12, 13 తేదీలలో జరుగుతున్న ఈ సదస్సును "స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం" అనే ప్రధాన ఇతివృత్తంతో భారత్ నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా "మానవత్వమే ప్రథమం" అనే సూత్రం ఆధారంగా ఈ చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. తమ అధ్యక్షత కాలంలో దేశ వ్యాప్తంగా 25కి పైగా నగరాల్లో 350కి పైగా సన్నాహక సమావేశాలు నిర్వహించి ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి భారత్ కృషి చేసిందని అధికారులు వెల్లడించారు.