తప్పుదారి పట్టించే సూచనలు, డార్క్ ప్యాటర్న్లపై రాపిడోకు ₹10 లక్షల జరిమానా
న్యూఢిల్లీ:రైడ్లు ఖరారు కాకముందే ప్రయాణికుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసేలా ఒత్తిడి తెచ్చే ప్రకటనలు, డార్క్ ప్యాటర్న్లు మరియు అక్రమ పద్ధతులను అవలంబించినందుకు ప్రసిద్ధ రైడ్-హెయిలింగ్ సంస్థ రాపిడో (రోపెన్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్) పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ₹10 లక్షల జరిమానా విధించింది. రైడ్కి ముందే అదనంగా టిప్ ఇవ్వాలని కోరడం, బుకింగ్ ప్రాసెసింగ్ సమయంలో భయాందోళనలు కలిగించేలా ‘కన్ఫర్మ్ షేమింగ్’ మరియు ‘ఇంటర్ఫేస్ ఇంటర్ఫియరెన్స్’ వంటి మోసపూరిత డిజైన్ల ద్వారా ప్రయాణికులను ప్రభావితం చేసినట్లు రంగవ్యాప్త తనిఖీల్లో సీసీపీఏ స్పష్టం చేసింది.
టిప్ అనేది సేవలు పొందిన తర్వాత మాత్రమే ఇష్టపూర్వకంగా ఇచ్చేదని, రైడ్ దొరకడానికే ముందస్తు షరతుగా అదనపు ఛార్జీలు కోరడం చట్టవిరుద్ధమని సీసీపీఏ తెలిపింది. అలాగే, అదనపు డబ్బులు చెల్లిస్తేనే రైడ్ త్వరగా దొరుకుతుందనే వాదనకు రాపిడో ఎలాంటి నిరాధారమైన డేటాను సమర్పించలేకపోయిందని పేర్కొంది. కాగా, వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం ఇటువంటి అన్యాయమైన వాణిజ్య పద్ధతులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, ఇతర సంస్థలైన ఓలా, ఉబెర్లపై కూడా పరిశీలన కొనసాగుతోందని సీసీపీఏ వెల్లడించింది.