ఈశాన్యంలో కొత్త 'డ్రగ్స్ రూట్' ఆందోళనకరం
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల మూలాలు కొత్త దారులు తొక్కుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఇటీవల స్వాధీనం చేసుకున్న భారీ డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించే క్రమంలో మయన్మార్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా ఒక కొత్త రవాణా మార్గం (డ్రగ్స్ రూట్) బయటపడిందని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత నెలలో గువహతిలో పంజాబ్కు తరలించడానికి సిద్ధంగా ఉంచిన ₹80 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకున్నట్లు తెలిపారు. గతంలో మాదకద్రవ్యాలు మయన్మార్-మిజోరాం, మయన్మార్-మణిపూర్ లేదా 'మోరే' మార్గాల ద్వారా వచ్చేవని, అయితే ఇప్పుడు కొత్తగా మయన్మార్ - చాంగ్లాంగ్ (అరుణాచల్ ప్రదేశ్) - తిన్సుకియా ద్వారా అప్పర్ అస్సాంకి సరఫరా అవుతున్నట్లు నిందితుల విచారణలో తేలిందని స్పష్టం చేశారు.
ఈ కొత్త సరఫరా వ్యవస్థ అప్పర్ అస్సాం భద్రతకు పెద్ద సమస్యగా మారిందని, ఈ రూట్ను పూర్తిగా పునాదులతో సహా అడ్డుకోవడానికి అస్సాం పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నారని సీఎం తెలిపారు.