ఢిల్లీ విమానాశ్రయంలో భారీ ఎయిర్ కార్గో హబ్ ఫెడెక్స్ $150 మిలియన్ల పెట్టుబడి
కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు హర్షం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధునాతన ప్రత్యేక ఎయిర్ కార్గో సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రముఖ లాజిస్టిక్స్ దిగ్గజం 'ఫెడెక్స్' (FedEx) మరియు 'ఢిల్లీ GMR విమానాశ్రయం' చేసుకున్న భాగస్వామ్యాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్ మోహన్ నాయుడు అభినందించారు.
గత కొన్నేళ్లుగా దేశంలో ఎయిర్ కార్గో కార్యకలాపాలు నిలకడగా పెరుగుతున్నాయని, సరుకు రవాణా (వాల్యూమ్స్) పరిమాణంలో దాదాపు 40 శాతం వృద్ధి నమోదైందని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా దేశంలోని లాజిస్టిక్స్ నెట్వర్క్ను బలోపేతం చేస్తున్నామని, రోడ్డు, రైల్వే మార్గాల తరహాలోనే విమానయాన రంగంలోనూ గొప్ప విప్లవం చూస్తున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎయిర్ కార్గో సదుపాయాలను, కార్గో హబ్లను సృష్టించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
సరుకు రవాణా సమయాన్ని తగ్గించడానికి ఇటీవల ప్రయోగాత్మకంగా (ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్) ప్రవేశపెట్టిన 'ట్రాన్స్షిప్మెంట్ పాలసీ' అత్యంత విజయవంతమైందని మంత్రి వెల్లడించారు. సరిగ్గా ఇటువంటి అనుకూలమైన సమయంలో ఫెడెక్స్ సంస్థ రూ.1,400 కోట్లకు పైగా ($150 మిలియన్ డాలర్లు) నిధులను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ఈ కొత్త పెట్టుబడి ద్వారా గతంలో కేవలం 50,000 చదరపు అడుగులుగా ఉన్న కార్గో కేంద్రాన్ని ఏకంగా 2.3 లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఇది భారత ఎయిర్ కార్గో రంగ అభివృద్ధికి ప్రతీక అని, భవిష్యత్తులో ఫెడెక్స్తో కలిసి మరింతగా పనిచేస్తామని రామ్ మోహన్ నాయుడు చెప్పారు. త్వరలోనే విమాన సరుకు రవాణా రంగంలోని ఇతర భాగస్వాములతో సమావేశమై, దేశంలోని విమానాశ్రయాలలో మరింత మెరుగైన సౌకర్యాలను ఎలా కల్పించవచ్చో సమీక్షిస్తామని ఆయన వెల్లడించారు.