హోర్ముజ్ జలసంధిలో సౌదీ ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి
రియాద్: వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సౌదీ అరేబియా ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ బలగాలు జరిపిన దాడిలో ఇద్దరు ఫిలిప్పీన్ నావికులు మరణించారు. సౌదీ అరేబియా జాతీయ షిప్పింగ్ సంస్థ 'బహ్రీ'కి చెందిన 'సిద్ర' (Sidra) అనే ట్యాంకర్ ఆగస్టు 31 రాత్రి భద్రతా దాడికి గురైందని, ఈ ఘటనలోనే ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.
తమ దేశ నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన ఈ దాడిని సౌదీ అరేబియా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దీనితో పాటు జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లపై ఇరాన్ జరిపిన దాడులను కూడా సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తప్పుబట్టింది. ఆయా దేశాలు తమ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుకునేందుకు చేపట్టే అన్ని చర్యలకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించింది.
ఈ దాడిపై కువైట్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సౌదీ ట్యాంకర్పై దాడి అంతర్జాతీయ నౌకాయాన చట్టాలను ఉల్లంఘించడమేనని, ఇది ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు, సముద్రయాన భద్రతకు ప్రత్యక్ష ముప్పు అని పేర్కొంది. ప్రాంతీయంగా ఉద్రిక్తతలు పెంచే ఇటువంటి చర్యలను ఇరాన్ తక్షణమే నిలిపివేయాలని కువైట్ డిమాండ్ చేసింది.