సార్వభౌమాధికార రక్షణ ప్రాతిపదికన కేసును కొట్టివేయండి
న్యూయార్క్ కోర్టును కోరిన నికోలస్ మదురో దంపతులు
న్యూయార్క్: తనపై మరియు తన సతీమణి సిలియా ఫ్లోర్స్పై అమెరికా నమోదు చేసిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా అభియోగాలను వెంటనే కొట్టివేయాలని వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో మాన్హాటన్ ఫెడరల్ కోర్టును కోరారు. తాము ఒక విదేశీ దేశానికి అధినేతగా, ప్రథమ మహిళగా ఉన్నందున రాజ్యాంగపరంగా తమకు ‘సార్వభౌమాధికార రక్షణ’ (Head-of-State Immunity) వర్తిస్తుందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు.
ఒక విదేశీ దేశాధినేతపై క్రిమినల్ విచారణ చేపట్టే ಅಧಿಕారం అమెరికన్ కోర్టులకు లేదని మదురో న్యాయవాదులు స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం విదేశీ అధినేతలకు క్రిమినల్ ప్రక్రియల నుండి మినహాయింపు ఉంటుందని, ఈ రక్షణను వెనిజులా ప్రభుత్వం మాత్రమే ఉపసంహరించుకోగలదని పేర్కొన్నారు.
ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మదురో, తాము నిర్దోషులమని, ఈ కేసు విచారణకు వెళితే తమపై మోపినవి తప్పుడు ఆరోపణలని తేలిపోతుందని తెలిపారు. జనవరిలో అమెరికా బలగాలు కారకాస్లోని తమ నివాసంపై దాడి చేసి తమను అక్రమంగా తీసుకువచ్చాయని, తాను ఒక ‘యుద్ధ ఖైదీ’నని మదురో అభివర్ణించారు.
మదురో దంపతులు వెనిజులా చట్ట అమలు సంస్థలను దుర్వినియోగం చేస్తూ, వేలాది టన్నుల కొకైన్ను అమెరికాలోకి తరలించడానికి డ్రగ్ కింగ్పిన్లతో కుమ్మక్కయ్యారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఈ దాడిని ఒక "ఖచ్చితమైన చట్ట అమలు చర్య"గా ట్రంప్ ప్రభుత్వం సమర్థించుకుంది.
నవంబర్ 17 కేసు కొట్టివేత అభ్యర్థనలపై విచారణాధికారి న్యాయమూర్తి ఆల్విన్ కె. హెల్లర్స్టీన్ సమక్షంలో వాదనలు జరగనున్నాయి. జూన్ 1 ఈ కేసుపై తుది విచారణ (Trial) ప్రారంభం కానుంది. ఒకవేళ ఆరోపణలు రుజువైతే మదురో దంపతులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ప్రాసిక్యూటర్లు ఈ నెల చివరలో కోర్టులో తమ కౌంటర్ దాఖలు చేయనున్నారు.