సన్న వడ్లకు రూ.500 బోనస్: అక్టోబర్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు
అన్నదాతల కష్టానికి తగిన ప్రతిఫలం అందించేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల అక్టోబర్ 15 నుంచి వానాకాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సీజన్లో ఏకంగా 65 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ఇందుకు గాను దాదాపు రూ.18,250 కోట్లు వెచ్చించనుంది. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 3,180 ఐకేపీ కేంద్రాలు, 4,372 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు, 731 ఇతర కేంద్రాలు అక్టోబర్ 1 నాటికే పూర్తిగా సిద్ధం కానున్నాయి. ధాన్యం తూకం వేసిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. గోదాములు, గన్నీ సంచులు, రవాణా వాహనాలు, హమాలీలు, తూకం యంత్రాలతో పాటు నాణ్యతను పరీక్షించే పరికరాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
మద్దతు ధర విషయానికి వస్తే, ప్రభుత్వం గ్రేడ్-ఏ రకానికి క్వింటాల్కు రూ.2,461, సాధారణ రకం ధాన్యానికి రూ.2,441 చెల్లించనుంది. దీనికి తోడు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన 7 రకాల సన్న వడ్లను పండించే రైతన్నలకు క్వింటాల్కు అదనంగా రూ.500 బోనస్ అందనుంది. బీపీటీ-5204, ఆర్ఎన్ఆర్-15048, కేఎన్ఎం-1638, జైశ్రీరామ్, హెచ్ఎంటీ-సోనా, డబ్ల్యూజీఎల్-44, కేఎన్ఎం-7715 రకాలకు మాత్రమే ఈ బోనస్ వర్తిస్తుంది. అయితే, రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే డీలర్ల వద్ద సరైన రకాన్ని నమోదు చేయించుకోవడం తప్పనిసరి. డీలర్లు బాధ్యత తీసుకొని ఈ రకాలను రిజిస్టర్ చేస్తేనే ప్రభుత్వమిచ్చే బోనస్ నేరుగా రైతుల ఖాతాల్లో చేరుతుంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.